చిన్న పిల్లలు మీకేమి తెలుసు?

మనం రోజు వింటున్న,లేదా అంటున్న మాట. నా జీవితంలో జరిగిన 3 సంఘటనల గురించి ఈ టపా. చదివిన తరువాత ఆ పై మాట వాడొచ్చో లేదో తేల్చుకోండి.

********************************************************************************

చెన్నై నుంచి బెంగళూర్ బస్సులో వెళ్తున్నా. వెల్లూర్ దాటాక బస్సు ఒక చోట టీ కోసం ఆపారు. కొంచం కాళ్ళు పట్టేసినట్టు ఉంటే దిగాను.

అక్కడ జనాలు అందరు టీ తాగి,దమ్ము కొట్టి ఆనందిస్తున్నారు. నేను ఎలాగో ఆ రెండు తాగను, వాళ్ళు వదులుతున్న పొగని ఆస్వాదించడం ఎందుకు అని పక్కన ఉన్న పాప్ కార్న్ కొట్టు దగ్గర నిల్చున్నా.

అందరు టీ, కాఫీ, సిగరెట్లు తాగి అక్కడే ఖాళీ కప్పులు, సిగరెట్టు ముక్కలు పడేసి వాళ్ళ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటున్నారు.

ఒక చిన్న పాప వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి పాప్ కార్న్ కొనిపించుకుంది.ఆ పాప్ కార్న్ కోన్ పట్టుకుని మెట్టు దిగుతూ పడబోతే వాళ్ళ నాన్న పట్టుకున్నారు. పాప చేతిలో ఉన్న పాప్ కార్న్ కోన్ లోంచి సగం పాప్ కార్న్ నేల మీద ఒలిగిపోయింది.

“నేను పట్టుకుంటాను అంటే పట్టుకోనిచ్చావు కాదు” అని వాళ్ళ నాన్న తిడుతున్నాడు. ఆ పాప తన చేతిలో ఉన్న కోన్ ని వాళ్ళ నాన్న చేతిలో పెట్టి కింద పడిన పాప్ కార్న్ ఏరడం మొదలు పెట్టింది.వాళ్ళ నాన్న మొహం ఎర్రగా మారిపోయింది.

“కింద పడినవి తినకూడదు అని చెప్పాను కద, అవి అక్కడే వదిలెయ్.అందరు చూస్తున్నారు.”, అని కోపం గా చూస్తున్నాడు.

ఆ పాప ఏరిన పాప్ కార్న్ తీసి పక్కన ఉన్న చెత్తకుండి లో వేస్తూ,”మనం ఏ తప్పు చేసినా కరక్ట్ చేసుకోవాలి అని కూడా చెప్పారు కద డాడీ. నేనే కింద పడేసాను కద డాడీ కాబట్టి నేనే ఎత్తాలి కద” అనేసి చేతులు దులిపేసుకుంది.

చుట్టూ చూస్తున్న వాళ్ళకి మాటలు లేవు, నాలాగే.

***************************************************************************

మా మవయ్య ఒకాయన ఉన్నారు. ఆయనంటే చిన్నపటి నుంచి మాకు అందరికీ భయం. మా అమ్మ, పిన్నులు కూడా అన్నం తినక పోతే మావయ్య ని పిలుస్తా, అల్లరి చేస్తే మావయ్యని పిలుస్తా…ఇలా బెదిరించడంతో చినప్పటి నుంచి ఆయనంటే అదొక రకమైన భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం.మేము ఎంత పెద్ద వాళ్ళం అయినా అది అలాగే ఉండిపోయింది.

ఆయన కూడా ఆ ఇమేజి కాపాడుకోవడం కోసం అనుకుంటా, ఎప్పుడు చాలా సీరియస్ గా ఉండేవారు. ఆ ఇమేజి మా తరువాత తరానికి కూడా క్యారీ చేశారు.

ఒకసారి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఆయన దగ్గరికి వెళ్ళి సీరియస్గా,”తాత ఎప్పుడు ఎందుకు అంత సీరియస్ గా ఉంటావు?….నువ్వు నవ్వుతూ ఉంటే అందరం నీకు ఫ్రెండ్స్ అయ్యిపొతాం కద” అనేసింది.

అది విని నాకు అనిపించింది, అవును ఈయన నవ్వు చివరి సారి ఎప్పుడు చూసానబ్బా అని.

అప్పటి నుంచి ఆయన కొంచం నవ్వడం మొదలుపెట్టారు.

*********************************************************************************

ఒకసారి వైజాగ్ నుంచి చెన్నై వెళ్తున్నా. howrah – chennai మెయిల్ అనుకుంట.

అందరు 8.30 కల్లా తినేసి పడకేసేశారు. నాకేమో 12.00 కి గాని నిద్రరాదు.

నాది అప్పర్ బర్త్, కాబట్టి కూర్చుని ఉన్నా. ఒక ఫామిలీ అనుకుంటా, ఒక జంట, వాళ్ళకో 6-7 ఏళ్ళ బాబు. భార్య భర్త లోవర్ లో పడుకున్నారు. బాబు నా బర్త్ కింద ఉన్న మిడిల్ లో పడుకున్నాడు. మరో మిడిల్ లో నా ఏజ్ ఉన్న ఎవరో అబ్బాయి పడుకున్నాడు.

ఆ మిడిల్ బర్త్ లో ఉన్న కుర్రాడు, హెడ్ ఫోన్లు తగిలించుకొని మరీ, గర్ల్ ఫ్రెండ్ తో అనుకుంటా సోది వేస్తున్నాడు. మనకి అలాంటి సౌలభ్యం లేదు కనుక “డోంట్ మ్యారీ బీ హ్యాపీ”, “నమ్మద్దు నమ్మద్దు ఆడ వాళ్ళని నమ్మద్దు” లాంటి పాటలు వింటూ కాలక్షేపం చేస్తున్నా.

ఏసీ కోచ్ అవ్వడం వల్ల మన హీరో గారి మాటలు అన్నీ క్లియర్ గా వినిపిస్తున్నాయి. అవతల హీరోయిన్ గారు అలిగినట్టు ఉన్నారు, ఈయన బుజ్జగిస్తున్నారు. వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా కొంచం అనీసీగా కూడా ఉంది.

సడన్ గా మధ్య బర్త్ లో ఉన్న బుడుగు లేచి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, “మమ్మీ, మమ్మీ గట్టిగా మాట్లాడి పక్క వాళ్ళని డిస్టర్బ్ చెయ్యడం బాడ్ మానర్స్ అని చెప్పావు కద, ఆ అంకుల్ కి వాళ్ళ మమ్మీ చెప్పలేదా”, అనేసాడు.

రెండు,మూడు కిసుక్కులు వినిపించాయి. వాళ్ళ అమ్మకి ఏమి అనాలో తెలియక,”గొడవ చెయ్యకుండా పడుకో” అనేసింది.

మళ్ళీ ఆ వైపు నుంచి ఒక్క మాట వినబడలేదు.

*********************************************************************************


అందరికీ నమస్కారం.

గత వారం పది రొజులుగా కొంచం పని ఎక్కువగా ఉండి మెయిల్స్ కూడా చూసుకోలెకపోతున్నా. ఇంక టపాలు రాసే టైం ఎక్కడ.

నేను ముందు టపాల్లో రాసిన ఆరంభ శూరత్వం అవ్వకూడదని మళ్ళీ టైం చేసుకుని రాస్తున్నా.

ఈ వారం రోజులలో జరిగిన ముఖ్యమైన విషయాల గురించి ఈ టపా.

IPL అయ్యిపోయింది. మా చెన్నై టీం గెలిచింది. (గెలిచిన టీం మన టీం అనుకుంటే ఏ బాధ ఉండదు).

కాని ఫైనల్స్ టైంలో గ్రౌండ్ లో కన్నా బయట చాలా విషయాలు జరిగాయి. ఈ వ్యవహారం మొత్తంలో ముగ్గురి పేర్లు వినిపించాయి.

మొదటి వ్యక్తి షషి థరూర్ ని మినిస్టర్ పోస్టు నుంచి తీసేసి, కేబినెట్ మినిస్టర్ రేంజ్ లో విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీలో వేసారు. కేరళ కాంగ్రెస్ లో మంచి పోస్టు కూడా ఇస్తారు అని ఒక పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ ఉంది.

ఇంక అతని జిగిరీ దోస్తు రెండో వ్యక్తి లలిత్ మోడి ని BCCI పూర్తిగా నిషేదించినంత పని చేసి, అతనిని సంజాయిషీ ఇవ్వమంది. ఆయన గారు ఇప్పటికీ తన తప్పు ఏమి లేదు అనే అంటున్నాడు. IT శాఖ వారు అన్ని జట్ల ఆఫీసులలో సోదాలు చేసారు, ముంబై జట్టు ఆఫీసులో తప్ప. ఎంతైనా అంబానీ టీం కద. చాలా మంది పైకి కనిపించిన వ్యక్తులు అసలు టీం ఓనర్లు కారు అని తెలిసింది.

ఇక ఈ గొడవ జరుగుతుండగా బయటకు వచ్చిన,  ఇప్పుడు అందరు మర్చిపోయిన వ్యక్తి సునందా పుష్కర్. మన దేశంలో మీడియా ఎంతకి దిగజారిందో చెప్పడానికి ఈమె ఒక సజీవ ఉదాహరణ. లలిత్ మోడీ ఈమె పేరు బయట పెట్టగానే, ఈవిడ చరిత్ర మొత్తం తవ్వారు.అందులో వాళ్ళకి కావలసిన విషయాలు హైలైట్ చేసి ఆవిడ వ్యక్తిత్వాన్ని చంపేసారు. ఆవిడ ఏ పార్టీ లో ఎవరితో కనిపించింది, ఎవరితో సంబంఢాలు ఉండొచ్చు అని రకరకాల పరిశోధనలు చేశారు. కాని ఆవిడ జీవితంలో అనుభవించిన కష్టాలు, వాటిని అధిగమించిన తీరు మొదలైన విషయాలను తొక్కేశారు.

ఒక కాష్మీరీ పండిట్ కూతురుగా, భర్తను కోల్ఫోయి, మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక కొడుకు కి సింగిల్ మథర్ గా, ఒక విజయవంతమైన బిజినెస్ కన్సల్టెంట్ గా, ఆవిడ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఒక సినిమాకి సరిపడా కథా వస్తువు ఆవిడ జీవితం. కాని ప్రజల దృష్టిలో ఆవిడని అథాపాతాళానికి తొక్కేసారు. అందంగా కనిపించడమే తన తప్పు అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో బాధ పడింది.

ఇంతా చేసి ఆవిడకి వచ్చిన లాభం ఏమిటయ్య అంటే, స్వెట్ ఈక్విటీ. అంటే, ఒకవేళ ఆ కొచ్చి జట్టు లాభాల్లోకి వస్తే, ఈవిడకి ఒక 70 కోట్లు వస్తాయి. అంటే డబ్బులు వస్తాయి అన్న గ్యారంటీ లేదు. మొదలైన మూడు సంవత్సరాల తరువాత ఈ ఏడాది ముంబై టీం, 50 కోట్లు లాభం సంపాదించింది. మిగిలిన జట్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి. అంటే వస్తుందో రాదో తెలియని డబ్బు ఆవిడ సంపాదించేసింది అని, ఆవిడ వ్యక్తిత్వాన్ని కించ పరిచారు.

ఇందులో తప్పు మీడియాది మాత్రమేనా?…. నన్ను అదిగితే ప్రజలది కూడా అంటాను, అలాంటి చానళ్ళను పోషిస్తున్నందుకు. ఏదైన ఘటన జరిగింది అని వార్త రాగానే మనం ముందు పెట్టే ఛానల్ ఖచ్చితంగా ఈ సెన్సేషనల్ చానల్స్ లో ఒకటి.

ఇక మరో ముఖ్య సంఘటన….. ముంబై మారణ హోమంలో పోలీసులకు చిక్కిన ఏకైక వ్యక్తి, అజ్మల్ కసాబ్ ఉరి శిక్ష. నిజంగా అది ఒక శిక్షేనా. అతను ఒక జీహాదీ. అంటే ప్రాణాలు అర్పించడానికి సిధ్ధపడి ఇక్కడికి వచ్చాడు. అతనిని పట్టుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి విచారించి, చివరికి అతని కోరికని నెరవేరుస్తున్నాం.

ఆ మారణ హోమానికి కారణమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాని మనకి కనిపించే వ్యక్తి ఈ కసాబ్ ఒక్కడే.ప్రజల దృష్టిని,కోపాన్ని ఇతని పైకి మళ్ళించింది మీడియా. ప్రజలేమో అతన్ని నడి వీధిలో ఉరి తీయాలి అని కోపంతో ఊగిపోతున్నారు. వాళ్ళ కోరిక ప్రకారమే అతనికి ఉరి శిక్ష పడింది.

ఒక్క సారి ఆలోచించండి….అతని బ్యాక్ గ్రౌండ్ గురించి. అతనొక 18 – 20 ఏళ్ళ యువకుడు.పేదరికమో, పరిస్థితుల ప్రభావమో ఉగ్రవాదం వైపు మళ్ళాడు. కొన్ని వార్తల ప్రకారం ఆ 10 మంది ముంబైలో దిగినప్పుడు డ్రగ్స్ ఎక్కించుకొని కాల్పులకు తెగబడ్డారు. కాబట్టి అతను ఏమి చేస్తున్నాడో అతనికి తెలియకపోయి ఉండవచ్చు. ఇదే తప్పు మీకు తెలిసిన ఏ కుర్రాడో చేస్తే మీరు కనిసం అతను అలా చెయ్యడేమో అని ఆలోచిస్తారు, ఇంకా కాదు అంటే, శిక్ష అనేది ఖైదీ లో పరివర్తన తేవాలి, చంపకూడదు అని కూడా అనొచ్చు. నేను ఐతే అదే అనేవాడినేమో.

కాని తెలిసి చేసినా తెలియక చేసినా, తప్పు తప్పే. కాబట్టి అతనికి శిక్ష పడాల్సిందే. కాని ఉరి శిక్షే ఎందుకు? .ఈ తీర్పు చెప్పినప్పుడు ఆ జడ్జి ఏమి అన్నారు అంటే…”ఇతనకి కఠిన కారాగార శిక్ష విధిస్తే మళ్ళీ కాందహార్ వంటి ఘటనలు జరగొచ్చు, అందుకే ఉరి శిక్ష” అని తేల్చారు.

అంటే కందహార్ లాంటివి జరిగినా ఆపే పరిస్థితిలో మన ప్రభుత్వం, వ్యవస్థ లేదు అని ఒప్పుకున్నట్టే కదా.

ఈ మొత్తం వ్యవహారంలో శిక్ష వేస్తే కసాబ్ తో పాటు అది అనుభవించ వలసిన వ్యక్తులు: అప్పటి హోం మంత్రి శివరాజ్ పాటిల్, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేష్ముఖ్, అప్పటి మహరాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్, కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్, డెప్యూటీ డైరక్టర్ జనరల్ (కోస్టల్ సెక్యూరిటీ), నావల్ ఛీఫ్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్……ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.

కాని వీళ్ళు ఎవరు కోర్టు వైపు కూడా చూసినట్టు లేదు.శివరాజ్ పాటిల్ పంజాబ్ గవర్నర్ గా విశేష సేవలు అందిస్తున్నారు. విలాస్ రావ్ దేష్ముఖ్ ప్రస్తుత కేంద్ర భారి పరిశ్రమల, ప్రజా ప్రయోజక సంస్థల మంత్రి. ఆర్.ఆర్.పాటిల్ ఇంకా మహరాష్ట్ర హోం మంత్రి గానే కొనసాగుతున్నారు. పైన పేర్కొన్న మిగిలిన బ్యూరోక్రాట్లు ఎవ్వరినీ కనీసం సస్పెండ్ చేసినట్టు కూడా లేదు.

న్యాయం అందరికీ సమానం అయ్యినప్పుడు ఈ తేడాలేమిటి. అంటే రాజకీయ నాయకులకి, ప్రభుత్వోజ్యోగులకి న్యాయం కొంచం ఎక్కువ సమానమా ?

కాని ఈ రెండు సంఘటనలలో మనం ఏమి చెయ్యగలం, మన చేతుల్లో ఏమి ఉంది అని అనిపిస్తుంది కదా. మనం చెయ్యగలిగినవి రెండు ఉన్నాయి.మొదటిది మన వోటు హక్కుని సరైన విధంగా ఉపయోగించడం.

రెండు, మీడియా చూపించినదే ప్రపంచం అనుకోకుండా, నాణేనికి రెండో వైపు ఉన్నట్టు, మనం కూడా ప్రతి విషయాన్ని మరో ధృక్కోణం లో విశ్లేషించడం నేర్చుకోవాలి.

ఏంటో, వార్తలు రాస్తుంటే డీడీలో వార్తలు చదివే శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చారు. ఆయన లాగ మిమ్మల్ని బోరు కొట్టించలేదు అని ఆశిస్తూ,

- పవన్

“నేను నిన్ను వదులుకోలేను, I don’t want to miss you,”

మోకాళ్ళ మీద కూర్చొని రవి అలా అనేసరికి, ఒక్కసారిగా షాక్ అయ్యింది బిందు. రవి ఇలా రియాక్ట్ అవుతాడు అని తను అసలు అనుకోలేదు, అది కూడా ఫేర్వెల్ పార్టీలో.

తను అసలు ఏమి అంది ? … “I think I will miss you”, అంతేగా.

“రవి నేను ఆ ఉద్దేశంతో అనలేదు”

“నేను మాత్రం అదే ఉద్దేశంతో అడుగుతున్నాను. ప్లీజ్ ఒప్పుకో. నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు. నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావనీ తెలుసు.”, మోకాళ్ళ మీద అలాగే ఉండిపోయాడు రవి.

పూర్తి డిఫెన్సివ్ లో పడిపోయింది బిందు. రవికి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ తల పైకి ఎత్తింది. దూరంగా హర్షిత నవ్వుతూ కనిపించింది.

“అదే చెప్పి ఉంటుంది, దానికొక్క దానికే తెలుసు, ఈ రోజు నా చేతుల్లో అయ్యిపోయింది”, మనసులో అనుకుంది బిందు.

ఒక పక్క ఆనందంగానే ఉన్నా, ముందు ఇక్కడి నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తోంది. అందరూ తమనే చూస్తున్నారు, ఆశ్చర్యంగా. తనకీ ఆశ్చర్యంగానే ఉంది. రవి ఏంటి, ఇలా ఏంటి అని. రవి కి కాలేజ్ లో మంచి పేరు ఉంది. టాపర్. బుధ్ధిమంతుడు, చూడడానికి బానే ఉంటాడు కూడా. అతనికి అమ్మాయిలు పెట్టిన నిక్ నేమ్ ముద్ద పప్పు.

బిందు కూడా తక్కువేమీ కాదు. బాగానే చదువుతుంది. కాలేజ్ బ్యూటీల్లో ఒకర్తి.

ఎలాగైనా ఈ సిట్యువేషన్ లోంచి బయట పడాలి అనుకొని, “లెగు రవి, అందరూ మనల్నే చూస్తున్నారు. మనం తరువాత మాట్లాడదాం.”

“లేదు బిందు. నువ్వు ఒప్పుకుంటేనే లెగుస్తాను. ఇప్పటికే చాలా లేట్ చేసాను. ప్లీజ్ ఒప్పుకో”

“సరే లెగు. అయినా ఫేర్వెల్ పార్టీలో ఏంటి ఇది”

“ఐతే నువ్వు ఒప్పుకున్నట్టే కదా ? …. ఇందాకే హర్షిత చెప్పింది, నేనంటే నీకు ఇష్టం అని, కాని నేను ఎలా రియాక్ట్ అవుతానో అని చెప్పడం లేదు అని చెప్పింది. ఆలోచిస్తే మళ్ళీ మనం కలవడం జరుగుతుందో జరగదో. కలిసినా అప్పటికి ఎలా ఉంటామో అనిపించింది. అప్పుడు అయ్యో మిస్ అయ్యానే అనుకోవాలి. ఇంక ఆగలేక పోయాను. ” , అలా చెప్పుకుంటూ పోతున్నాడు రవి.

“ఆగు ఆగు. ముందు ఎగ్జామ్స్ అవ్వనీ. అప్పుడు కలిసి మాట్లాడదాం ఫ్యుచర్ గురించి”, అనేసి, ఇంక అక్కడే ఉంటే కష్టం అనుకొని ఇంటికి బయలుదేరింది.

ఎగ్జామ్స్ అయ్యాయి. రవి మామూలుగా బాగానే రాసాడు. బిందు ఏదో అయ్యాయి అనిపించింది.

చివరి ఎగ్జామ్ తరువాతి రోజు ఇద్దరూ కలుసుకొని మాట్లాడుకున్నారు. ఇద్దరి ఇంట్లోనూ ఈ విషయం చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇద్దరికీ అప్పటికే ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీ లో కాంపస్ ప్లేస్ మెంట్లు వచ్చాయి కాబట్టి, ప్రస్తుతానికి ఇంట్లో ఏమీ చెప్పకుండా, ముందు ట్రైనింగ్ కి వెళ్ళి, జాబ్ లో జాయిన్ అయ్యాక చెప్దాం అని డిసైడ్ అయ్యారు.

ఆరు నెలల తరువాత, ఇద్దరికీ ట్రైనింగ్ వేరు వేరు ఊర్లలో జరిగినా, ఇద్దరూ కంపనీ వాళ్ళని బ్రతిమాలుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇద్దరూ  శెలవు తీసుకుని ఊరు వెళ్ళి, ఇంట్లో చెప్పారు. రవి వాళ్ళ ఇంట్లో చూద్దాం అన్నారు.

బిందు వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా పెద్ద పెద్ద రియాక్షన్స్ వచ్చాయి. “నిన్ను ఇందుకేనా చదివించింది”, అని వాళ్ళ అమ్మ. “అసలు అమ్మాయిని చదివించొద్దు అంటే విన్నారు కాదు, ఉద్యోగం కూడా చేయిస్తున్నారు, మా కాలం లో ఇలాంటివి వినలేదు”, అని వాళ్ళ బామ్మ. వాళ్ళ నాన్న గారు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. “మొన్న మా రామారావు ఎవరో అబ్బాయి గురించి చెప్పాడు. హైదరాబాద్ వెళ్ళి జాబ్ కి రెండు నెలలు లీవు పెట్టి రా. అబ్బాయి వాళ్ళని చూసుకోడానికి పిలుస్తాను “, అన్నారు కూల్ గా.

హైదరాబాద్ వచ్చాక ఇద్దరూ వాళ్ళ ఇంట్లో జరిగినవి చెప్పుకున్నారు. ఇంక లేట్ చేస్తే లాభం లేదు అనుకొని రవి వాళ్ళ ఇంటికి ఫోను చేసి పెళ్ళికి డేట్ చూడమని చెప్పాడు. “నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నీకూ మాకూ ఏ సంబంధం ఉండడు”, అని రెస్పాన్స్ వచ్చాక ఇక ఏ దారీ లేక ఫ్రెండ్స్ సహాయంతో ఆర్య సమాజ్ లో పెళ్ళి చేసుకున్నారు.

వాళ్ళ డాడీ అర్థం చేసుకుంటారు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళిన బిందు ని వాళ్ళ నాన్న గారు ఒకటే అన్నారు. “నీ మీద నమ్మకంతో నిన్ను చదివించాను, ఉద్యోగం చెయ్యనిచ్చాను, మీ విషయం చెప్పినా, నా మాట వింటావనే నమ్మకంతో నిన్ను ఒక్కదాన్నే హైదరాబాద్ పంపించాను. నా మాట నీకు లెక్క లేనప్పుడు, నీ పెళ్ళిని, ఈ అబ్బాయిని నేను ఎందుకు లెక్క చేయాలి ?”

ఇద్దరూ హైదరాబాద్ వచ్చేసారు. ఇక ఒకరికి ఒకరు అనుకొని జీవితాన్ని ప్రారంభించారు. ఇద్దరూ ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చారు. రవి కి ఇంకో మంచి కంపనీలో మంచి ఆఫర్ వస్తే అక్కడికి మారాడు.

రెండు ఏళ్ళు గడిచాయి. బిందు ఒక పాప కి జన్మనిచ్చింది. రెండు ఇళ్ళకూ కబురు పెట్టారు. రవి వాళ్ళు ఎవరూ రాలేదు కాని బిందు వాళ్ళ నాన్న గారు వచ్చారు. రవి బిందుని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూసి ఆనందించారు. బిందు వాళ్ళ ఇంటి నుంచి ఫోన్లు రావడం మొదలు అయ్యాయి.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన తన ఫ్రెండ్ తో కలిసి ఒక సాఫ్ట్ వేర్ కంపనీ మొదలు పెట్టాడు రవి. బిందు ని జాబ్ మానిపించాడు.

ఒక సంవత్సరం గడిచింది. లోను తీసుకొని ఒక మంచి ఇల్లు కొన్నాడు రవి. కారు కొన్నాడు. మొత్తం లైఫ్ స్టైల్ మార్చేశాడు.

అప్పుడు వచ్చింది రిసెషన్. ఆర్థిక మాంద్యం.

రవి కి పని పెరిగింది, వత్తిడి పెరిగింది. ఇంట్లో చిరాకు పడటం పెరిగింది. రవి ఇంటిలో ఉండే టైము తగ్గింది.

బిందుకి రవి తనకి దూరం అవుతున్నాడన్న భావన కలగడం మొదలైంది.

ఒక రోజు రవి మధ్యానం ఇంటికి వచ్చి, “నువ్వు పాప కలిసి మీ డాడీ దగ్గరకి వెళ్ళండి. ఎప్పటి నుంచో రమ్మని అంటున్నారని అన్నావు కద. ఈ రోజు సాయంత్రం ట్రైను కి టికట్టు బుక్ చేసాను” అన్నాడు.

బిందు కి ఏమీ అర్థం కాలేదు. నిన్ననే వాళ్ళిద్దరికీ గొడవ అయ్యింది. ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళీ గొడవ అవుతుందేమో అని ఏమీ అనకుండా తనవి పాప వి బట్టలు సర్దుకుంది.

సాయంత్రం స్టేషన్లో దింపాడు రవి. “జాగ్రత్త. దారిలో మీ డాడీకి ఫోను చెయ్యి “, అన్నాడు.

అప్పుడు గుర్తు వచ్చింది బిందుకి ఫోను మర్చిపోయింది అని. రవికి చెప్తే, “ఎందుకు అంత గాబరా. ఇదిగో నా ఫోను పట్టుకు వెళ్ళు”, అని ఇచ్చాడు.

“నీ ఫోనా. నాకు ఎలా వాడాలో సమంగా తెలియదే. సరేలే ఏదోకటి పడతాను గాని, నువ్వు బయలుదేరు, మళ్ళీ మన ఇంటి దగ్గర స్కూల్ వదిలితే, ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది”, అని రవి ని పంపించేసింది బిందు.

బిందు అన్నట్టుగానే రవి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు.

ఇక్కడ బిందు ట్రైను అరగంట లేటు. ఖాళీగా ఉంది కదా అని, రవి ఫోను లో ఫీచర్స్ చూడటం మొదలు పెట్టింది. ఒక చోట తన చూపు ఆగిపోయింది. ట్రైను వస్తున్నట్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. బిందు బయలుదేరింది.

రవి ఇంటికి వచ్చాడు. హాలులో ఉన్న స్విచ్ బోర్డు దగ్గరకి వచ్చాడు. స్విచ్ దగ్గర చెయ్యిపెట్టాడు. అది చాలా రోజులుగా రిపేరులో ఉంది. స్విచ్ నొక్కి ఒక అయిదు నిమిషాలు పట్టుకుంటే, అంతా అయ్యిపోతుంది. ఒక్కసారి రవి ఆలోచించాడు.

“రేపు ఇల్లు సీజ్ చేస్తారు. కారు కూడా తీసుకువెళ్తారేమో. అసలు బిజినెస్ లోకి దిగకుండా ఉండవలసింది. రిసెషన్ వల్ల చేతిలో ఉన్న ప్ర్రాజెక్టులు పోయాయి. ఈ రోజు బిజినెస్ పార్ట్ నర్ IP పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక నా కెరీర్ అయ్యిపోయింది. బిందుకి ఇదేమీ తెలియకూడదు. బిందుకి ఏమీ కాకూడదు. నా ఇన్సూరన్స్ డబ్బులతో తను, పాప వాళ్ళ డాడీ దగ్గర బాగానే ఉండొచ్చు.”

ఇంతలో కాలింగ్ బెల్ చప్పుడు.

“ఈ టైంలో ఎవరు? బిందు వచ్చేసిందా ? …. ఇప్పుడు తలుపు తీయక పోతే అనుమానం వస్తుంది. నాది సుసైడ్ అని తెలిస్తే తను తట్టుకోగలడా”, అనుకుంటూ తలుపు తీసాడు. ఎదురుగా బిందు.

“ట్రైను మిస్ అయ్యిందా బిందు ?”

“నేను నిన్ను మిస్ అవ్వలేను, I don’t want to miss you”, అని రవిని పట్టుకోని ఏడ్చేసింది బిందు.

(గమనిక: ఈ టపాలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితం. రిసెషన్, ప్రేమ తప్ప)

ఏప్రల్ 22,2015 08.15

BPL వారి APL (Andhra Premier League) 2015 F5 లో సెమీఫైనల్ మ్యాచు.

టెక్కలి టైగర్స్ V/S  రామగుండం రేంబోస్

టెక్కలి టైగర్స్ తరఫున, టాటా స్కై టాప్ క్లాస్ టాస్ గెలిచి బార్నవిటా బ్యాటింగ్ ఎంచుకున్నాడు కార్బన్ మొబైల్ కమాల్ కెప్టెన్ కమలాకర్

ఒంటి నిండా యాడ్లతో అక్కడక్కడా కనిపించే అదోరకమైన రంగు కలిగిన వాళ్ళ టీము జెర్సీ వేసుకొని బ్యాటింగుకి దిగారు ఒనిడా సమర్పించు ఓపెనింగు బాట్స్ మన్

మొదటి బంతి – జి.ఎం.ఆర్ వారి జిడ్డు బంతి (అనగా డాట్ బాల్)చేశాడు బాట్స్ మన్

రెండో బంతి – సింగపూర్ ఎయిర్ లైన్స్ సమర్పించు సూపర్ సింగిల్.

ఇంతలో బ్రూ స్ట్రాంగ్ కాఫీ స్ట్రాటజిక్ టైం అవుట్ (ఈ టైములో టీవీలో రెండు యాడ్లు)

స్ట్రాటజిక్ టైములో, “ఇంత స్లోగా ఆడితే RBS బ్యాంకు సమర్పించు రన్ రేటు తగ్గిపోతుంది”, అని రెండు చీవాట్లేసి వాళ్ళ టీము డ్రింకు అయిన రస్నా తాగించి వచ్చాడు కార్బన్ మొబైల్ కమాల్ కెప్టెన్ కమలాకర్ (కా.మొ.క.క.కమలాకర్).మరి వాళ్ళ టీములో రంజీ ట్రొఫీ మ్యాచులు చూసిన అనుభవం ఉన్నది అతనొక్కడికే.

మూడో బాలు – కెప్టెన్ చీవాట్లు పనిచేశాయేమో,బాట్స్ మన్ కంఫర్ట్ డిటర్జెంట్ కంఫర్టెబుల్ ఫోరు కొడదాము అనుకొని ముందుకు వస్తే, ఆ బాలు కాస్తా ఇండిగో నేషన్ వారి ఇన్ స్వింగర్ అయ్యి మ్యాగి మిడిల్ స్టంప్ ని తాకింది.

వికట్టు మీద బెయిల్సు లెగకుండానే టీవీలో మూడు యాడ్లు వచ్చేసాయి.

టెక్కలి టైగర్స్ 2 లక్షలకు మొన్నే కొన్న కజకిస్తాన్ క్రికెట్ స్టార్ సాయిబ్ మోలిక్ ని బ్యాటింగుకు దింపాడు కా.మొ.క.క.కమలాకర్

నాలుగో బాలు – సోనీ సూపర్ సిక్సు కొట్టబోయి బౌండరీ దగ్గర ఉన్న నైజీరియా ఆటగాడు మాగాయ తింటీనీ కి కోంపాక్ వారి కంపాక్ట్ కాచ్ ఇచ్చి వెనుదిరిగాడు మన స్టార్ బాట్స్ మన్.

టీవీలో మూడు యాడ్లు

ఇక తప్పదు అనుకొని,మన కా.మొ.క.క. కమలాకర్ రంగం లోకి దిగాడు.

అయిదో బాలు వెయ్యడానికి బౌలర్ బౌండరీ వరకూ నడుచుకు వెళ్తున్నాడు.ఇదే టైము అనుకొని మన కమలాకర్ తన కంప్యూటర్ లో ఆడిన క్రికట్ ఙానాన్ని అంతా ఉపయోగించి టొయోటా ఫ్రంట్ ఫుట్ డ్రైవు ఆడదామా? ITC స్క్వేరు కట్ ఆడదామా అని తను కట్టుకున్న పల్సర్ ప్యాడు లోపల ఉన్న మోకాలినంతా ఉపయోగించి ఆలొచిస్తున్నాడు.

టీవీ కెమెరా ప్యాన్ అయ్యి పార్లే గ్లూకోసు వారి పెవీలియన్ లో కూర్చున్న వొడాఫోన్ వండర్ ఫుల్ కోచ్ లక్ష్మణ్ వైపు జూము అయ్యింది.

లక్ష్మణ్ దీర్ఘాలోచన లో ఉన్నాడు.ఇందాకే రేణిగుంట రేంజర్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చింది తనకి ఫోనులో.మన రాష్ట్రం నుంచి టెస్టుల దగ్గరి నుంచి F5 దాకా ఆడిన అనుభవం ఉన్న ఏకైక వ్యక్తి కావడం అతనికి బాగా కలిసి వస్తోంది.

తను ఆడతున్నప్పటి నుంచి క్రికట్ లో వస్తున్న మార్పులు అతడు చూస్తూనే ఉన్నాడు.మొదట టెస్టులు తగ్గించి వన్ డేలు పేంచారు.తరువాత టైము కలిసి వస్తుంది అని వన్ డేలు తగ్గించి T20 లు పెంచారు….

అప్పుడు వచ్చింది IPL.మొత్తం ఆట స్వరూపాన్నే మార్చేసింది.ఇన్నాళ్ళు తమ దేశం కోసం ఆడిన ఆటగాళ్ళు అందరూ, వాళ్ళకు ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం ఆడటం మొడలు పెట్టారు.ఇందులో భాగంగా,పంజాబ్ కి శ్రీలంకా కెప్టెన్,కలకత్తాకి ఆస్ట్రేలియా కోచ్, ముంబై టీములో రాయుళ్ళు,చెన్నై టీములో సింగులు ఇలా మారిపోయింది.

కొన్నాళ్ళకి,ఈ 20 ఓవర్లు చూడడం కుదరదు అనుకొని దాన్ని 10 ఓవర్లకి కుదించి మధ్యలో యాడ్లు ఎక్కువ క్రికట్ తక్కువ గా మారింది. చివరకి స్పాన్సర్స్ ఒత్తిడితో 10 ఓవర్లను కూడా 5 ఓవర్లకు కుదించి F-5 (Five – 5) గా మార్చారు.

ప్రతి ఊరికీ ఒక టీము తయారు అయ్యింది.వాళ్ళ ఊరికి నీళ్ళు లేక పొయినా పర్వాలేదు కాని క్రికట్ టీము మాత్రం ఉండాలి అని జనాలు అనుకునేవారు.దీంతో క్రికట్ టీముకి ఎవడు ఎక్కువ స్పాన్సర్ చేస్తాడో వాడికే ఓట్లు పడేవి.

ఇన్ని టీములు ఉండటంటో ముందు జిల్లా స్థాయిలో ఆ తరువాత రాష్ట్ర స్థాయిలో, అందులో గెలిచిన టీములకి జోనల్సు, ఆ తరువాత జోన్ల మధ్య  పోటీ పెట్టి, IPL విన్నర్ ని ఎంపిక చెయ్యడం మొడలు పెట్టారు.ఇన్ని మాచ్లు ఆడటం వలన అంతర్జాతీయ పోటీలకి టైము లేక,ఇండియా టీము అసలు ఆడటమే మానేసింది.

ఈ మాచులు చూపించడానికి ఓ 30 చానల్లు పెట్టారు IPL – A, IPL – B….అని

ఈ దెబ్బకి ఇంటికో క్రికటర్ తయారు అయ్యాడు.దాని వల్ల ఒలంపిక్స్ కి పంపించడానికి జనాలు లేక బాంగ్లాదేష్ నుంచి వచ్చిన కాందశీకులను పంపడం మొదలు పెట్టారు భారత ప్రభుత్వం వారు.

ఆట వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కడూ రంగంలోకి దూకెయ్యడంతో తెలుగు సినిమా హీరోయిన్లు 1,2 సినిమాలు చేసి తమిళ్ సినిమాలకు వెళ్ళినట్టు ఆటగాళ్ళు అందరూ 1,2 మాచ్లు ఆడి పక్క టీముకి చెక్కేయడం మొదలుపెట్టారు.

ఇక కొన్ని సంవత్సరాల క్రితమే ఆడవాళ్ళకి కూడా F5 పోటీలు మొదలు పెట్టారు.కాని అవి సీరియల్సు వచ్చే చానళ్ళలో ఇస్తున్నారు అని,ఇది పురుషాహంకారానికి నిదర్శనమని మహిళా సంఘాలు గోల చెయ్యడంతో రిజర్వేషన్ కింద వాళ్ళకో 10 చానళ్ళు ఇచ్చేసారు.

వచ్చే సంవత్సరం తానే ఒక టీము కొంటే ఎలా ఉంటుంది అని గట్టిగా ఆలొచిస్తున్న లక్ష్మణ్ కి మొహం మీద తడి తడి గా అనిపించింది.

కొంప దీసి వీడియోకాన్ వర్షం బ్రేకు కాదు కద అనుకున్నాడు….

“బాబూ….లెగు,లెగు…..మనం మ్యాచు గెలిచాం,అందరూ గ్రౌండ్ చుట్టూ పరిగెడుతున్నారు….నువ్వు ఆడకపొయినా పరిగెత్త కుండా పడుకుంటే ఫాన్సు ఫీలు అవుతారు”, అని అసిస్టెంటు కోచు నిద్ర లేపడంతో ఆ వైష్ణవ మాయలోంచి బయటకు వచ్చి తన టీము వాళ్ళతో పరిగెత్తడం మొదలు పెట్టాడు లక్ష్మణ్.

(గమనిక:ఈ టపాలో పాత్రలు,కంపెనీలు అన్నీ కల్పితాలే,ఎవరికైన ఎక్కడో విన్నట్టు ఉంటే నాది బాధ్యత కాదు. rediff లో ఒక ఫోరంలో ఎవరో చేసిన కామెంటు ఆధారంగా)

ప్రొద్దున్నే నిద్ర లేవడం ఎలా? (రాత్రి ఎప్పుడు పడుకున్నా…)

అసలు నేను బ్లాగులు రాస్తాను అని కలలో కూడా అనుకోలేదు.రాసినా అందులో ఈ విషయం మీద రాస్తాను అని అస్సలు అనుకోలేదు.

పుట్టి బుధ్ధెరిగినప్పటి నుంచి తొమ్మిదిన్నరకే గంటలకే ముసుగు తన్ని పడుకోవడం,మళ్ళీ ప్రొద్దున్న ఎవరైన లేపితే లేవడం.

ఇలా  ఉన్న నా జీవితాన్ని మార్చేసింది…..

ఎవరైన అమ్మాయి అనుకున్నారా?

టైటిల్ జస్టిఫికేషన్ లేకుండా రాయడానికి నేను ఏమైనా తెలుగు సినిమా కధ రాస్తున్నానా?

నా నిద్ర స్టైల్ ని మార్చింది ఇంజినీరింగ్.ఏమి చదవాలో తెలుసుకునే సరికే దెయ్యాలు తిరిగే టైము అయ్యేది.చివరికి పరీక్ష హాలు లో నిద్ర వచ్చేది.100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 మంది కూడా చూడని సినిమా నిర్మాత లా అయ్యేది నా పరిస్థితి.ఇక తప్పక నైట్ అవుట్ లు అలవాటు చేసుకున్నాను.అదెంత వరకు వెళ్ళింది అంటే ఫైనల్ ఇయర్ లో అనుకుంటా అస్సలు పడుకోకుండానే చివరి సెమెస్టెర్ లోని అన్ని పరీక్షలూ రాశాను.

దాని వల్ల సైడు ఎఫెక్ట్ లు ఉన్నాయి అనుకోండి.లారీ టైరు నుంచి సైకిలు టైరులా తయారు అయిన జూ.బంటీఆర్  లా నేనూ బాగానే తగ్గాను.చాలా క్లినిక్ ల వాళ్ళు నా ఫొటో కోసం వచ్చేసరికి కళ్ళు తేరుచుకొని, మళ్ళీ గట్టిగా మూసుకొని పడుకోవడం మొదలు పెట్టాను.

ఈ తొందరగా లెగకపోవడం వల్ల నేను ఎంత ఫేమస్ అయ్యాను అంటే,మా ఫ్రెండ్స్ ఒక సారి ఏదో సినిమా మార్నింగ్ షో కి ప్లాన్ చేస్తుంటే విని,నేను కూడా వస్తాను అన్నాను. మరాఠీ సినిమా మళయాళ డబ్బింగ్ చూస్తున్నత్తు మొహం పెట్టి,మేము వెళ్తున్నది మార్నింగ్ షో కి రా,ఈ సారి మ్యాట్నీకో,ఫస్ట్ షోకో ప్లాన్ చేసినప్పుడు చెప్తాంలే అన్నారు.

నా క్లోస్ ఫ్రెండ్ ఒకడు,”పోన్లే తీసుకువెళ్దాంలే రా” అన్నాడు. అయితే వాడిని నిద్ర లేపి తీసుకు వచ్చే బాధ్యత నీది అన్నారు. వాడు కూడా తెలుగు సినిమాలో సైడు కారక్టరు లాగ సరిగ్గా ఆ టైముకి పార్టీ మార్చేశాడు.

ఇక ఇలా లాభం లేదు అని,ఈసారి కవన్ పల్యాణ్ సినిమా రిలీజు రోజు మీ అందరి కన్నా ముందే లేచి,మార్నింగ్ షో టికట్లు తీస్తాను అన్నాను.అందరూ భలేక్రిష్ణ ఫైటింగ్ చూస్తే ఎలా నవ్వుతారో అలా పగలబడి నవ్వారు.

అలాంటి బెట్లు కట్టకు.ఈ జన్మలో అవ్వుతుందో లేదో తెలియదు,త్వరలో వచ్చే ఏ తెలుగు సినిమాకైనా మ్యాట్నీ టికట్లు తీయి చాలు..అని డిసైడు చేశారు.

కొన్ని నెలల తరువాత… (అంటే హమేష్ బాబు సినిమా పాట షూటింగ్ అయ్యాక,చిల్లరి గరేష్ 3 సినిమాలు రిలీజు అయ్యాక)

చేతిలో గానార్జున “బేడీ” సినిమా టికట్లతో మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా.(ఆ సినిమా మధ్యలో మా వాళ్ళకి కనిపించకుండా వచ్చేసాను అనుకోండి).

ఈ మార్పు ఎలా సాధ్యం అయ్యింది అనుకుంటున్నారా ? (ఇక్కడి నుంచి నా గురించి సోది ఉండదు.ముందు చెప్పిన టైటిల్ జస్టిఫికేషన్ చేస్తాను)

ప్రొద్దున్నే నిద్ర లేవడానికి:

1.మీరు పాలవాడైనా,పేపర్ వాడైనా అయ్యి ఉండాలి

2.వంతెన నిత్యపారాయణ అయినా అవ్వాలి

3.గట్టి పట్టుదల అయినా ఉండాలి (అంటే ఎన్ని సినిమాలు పోయినా మళ్ళీ నటించడానికి ప్రయత్నించే మన సూపర్ స్టార్ జితిన్ అంత గట్టిగా)

మీరు మొదటి రెండు అవ్వడానికి ఛాన్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి 3వది ఎలా పెంపొందించుకోవాలో చెప్తాను.

మీరు చాలా చోట్ల చూసే ఉంటారు మనిషి రోజుకి 8 గంటలు నిద్ర కావాలి, 6 గంటలు నిద్ర కావాలి అని.నిజానికి అది అందరు మనుషులకి మీకు కాదు(అంటే మీరు మనిషి కాదు హోమన్ బాబు,అని నా ఉద్దేశం కాదు).ఆ రిపోర్టులు అన్నీ కనీసం ఓ 1000 మంది మీద చేసిన ప్రయోగాలలో వచ్చిన విషయాలు.కాని వాళ్ళు ప్రయోగాలు చేసింది మీ మీద కాదు కద.మరి మీరు ఎన్ని గంటలు పడుకోవాలో ఎవరికి తెలుస్తుంది అంటే….జిరంజీవి కి మల్లూ గురువింద్ లాగ ఎప్పుడూ మీతో పాటు ఉండే మీ శరీరానికి.

ఇంకో విషయం చెప్పాలి.మనకి బుర్రలో రెండు బుర్రలు ఉంటాయి…అర్ధం కాలేదా?…

మనకి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి.అంటే సినిమాల్లో కనిపించే అంతరాత్మ లాగ.అలాంటివి నిజ జీవితంలో బయటకు రావులెంది. (కాన్షియస్ మైండ్ – సబ్ కాన్షియస్ మైండ్ గురించి మరో టపాలో డీటైల్డుగా రాస్తాను)

మనం ఏదైనా అనుకున్నవి జరగాలి అంటే ముందు మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని నమ్మాలి.(సాఫ్ ట్ వేర్ భాషలో చెప్పాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ ని మనం ప్రోగ్రాం చేసుకోవాలి)

అలాగని నాకు భలేక్రిష్ణ అంటే ఇష్టం,మల్లూ టార్జన్ అంటే ఇష్టం లాంటివి ప్రోగ్రాం చేసుకోకంది.ఏమైనా జరిగితే నాది బాధ్యత కాదు.

ఇన్నాళ్ళు మీరు ఇన్ని గంటలు పడుకోవాలి అని ప్రోగ్రాం చేసుకున్నారు.ఇప్పుడు ఎన్ని గంటలకి లేవాలో ప్రోగ్రాం చేసుకోండి.ఇది రోజూ మననం చేస్తూ ఉండండి.ఎట్టి పరిస్థితులలోనూ ప్రొద్దున మిమ్మల్ని లేవనివ్వని ఆత్మారాం గాడిని అలారం కొట్టగానే, సచిన్ సిక్సు కొట్టినట్టు చితగ్గొట్టంది.ఈ పని రోజూ చెయ్యండి.శెలవలు,ఆదివారాలు అని చూడకండి.వాన పాట అని చెప్పి భలేక్రిష్ణ తొడగొట్టడం మానేస్తాడా?

ఎప్పుడైతే ఆ ఆత్మారాం గాడు ఏమీ అనడో,అప్పుడు మీ ప్రోగ్రామింగ్ పనిచేసినట్టు.మీరు ఎంత లేటుగా పడుకున్నా ఆ టైముకే నిద్ర లేస్తారు.మీ శరీరానికి నిద్ర చాలలేదు అనిపిస్తే అదే మిమ్మల్ని ఆ రోజు రాత్రి తొందరగా నిద్ర పుచ్చేస్తుంది.

అసలు ప్రొద్దున్నే లేవడం వల్ల ఎన్ని లాభాలు అనుకున్నారు:

1.  ప్రొద్దున్నే టీవీలో వచ్చే స్వామీ సత్యానంద సూక్తులు వినొచ్చు.(ఈయన ఈ మధ్య కనబదటం లేదు,కాని ఎవరో ఒక తలకుమాసిన తలనెరిసిన స్వామీజీ సూక్తులు చెప్పడానికి తయారుగా ఉంటారు లెండి)

2.  అవి నచ్చక పోతే ఆ రోజు మీ జాతకం ఎలా ఉందో చూడొచ్చు.(కొత్తగా తెలుసుకోవడానికి ఏమీ లేదు అనుకుంటే ఏమీ చేయ్యలేం)

3.  ప్రొద్దున్నే గూటిని వదిలే పిట్టలని చూడొచ్చు (ఇక్కడ పిట్టలు అంటే పక్షులు అని నా ఉద్దేశం.ఇంకోలా అనుకుంటే నా తప్పు కాదు)

కాబట్టి ఇన్ని లాభాలు పొందాలి అంటే నా సూచనలు పాటించండి.

ప్రొద్దున్నే లేవాలి అంటే ఇంకో గ్యారంటీ చిట్కా … ముందు రోజు రాత్రి వచ్చే మీకు ఇష్టమైన టీము IPL మాచ్ చూడొద్దు.దెబ్బకి ప్రొద్దున్నే ఏమి అయ్యిందో తెలుసుకోవడానికి, పేపర్ కోసం నిద్ర లేస్తారు.

ఇవన్నీ చెప్పడానికి ఎంతో సులువైనా పాటించడం సంకటేష్ ఇంటర్వ్యూలో తేలుగు మాట్లాడినంత కష్టం.

ప్రయత్నించండి.పని చేస్తుంది అనిపిస్తే పాటించండి.నాకు పని చేసింది.ఇందాక చెప్పినట్టు మీకు పని చెయ్యాలి అనీ లేదు,పని చెయ్యదు అనీ లేదు.

(గమనిక: ఈ టపాలో కొందరు ప్రముఖుల పేర్లు వాడడం జరిగింది.అది సరదా కోసమే కాని ఎవరినీ బాధ పెట్టడానికి కాదు అని మనవి.నేను కూడా తెలుగు సినిమా అభిమానినే)

టైం ఉదయం 8.30.వైజాగ్ బస్టాండ్.

అరకు వెళ్ళే బస్సులో ఉన్నాను.బస్సు నిండుగానే ఉన్నా డ్రైవరు ఎంతకీ ఎక్కడం లేదు.నేను ఆలోచనలో పడ్డాను.అసలు అరకు ఎందుకు వెళ్తున్నానా అని.

నిన్ననే చెన్నై నుంచి ఊరిలో దిగాను.ఇంజినీరింగ్ చేసిన తరువాత ఉద్యోగరిత్యా చెన్నై మహానగరంలో ఉంటున్నాను.ఈసారి మూడు నాలుగు రోజుల శెలవలు వచ్చాయి.నేను ఇంకో 2 రోజులు లీవు తీసుకొని వైజాగ్ వచ్చేసాను.ఇంటర్ చదువుతున్నప్పుడూ,ఇంజినీరింగ్ లోనూ అరకు రెండు మూడుసార్లు వెళ్ళడం జరిగింది.జాబ్ లో చేరాక కుదరలేదు.రెండు వారాల క్రితం మా వినయ్ గాడికి ఫొను చేస్తే అరకులో జాబ్ చేస్తున్నాను,ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు రమ్మన్నాడు.అందుకే ఈ ప్రయాణం.

అసలు ట్రైనులో వెళ్దాము అని అనుకున్నాను కాని ట్రైను ఉదయం 7కి అయితే 7.30కి స్టేషనుకి వెళ్ళాను.తరువాత రోజు ట్రైనులో వెళ్దాం అనుకొని మా వాడికి ఫొను చెస్తే బస్సులో వచ్చేయ్, ఈ రోజు అంతా తిరుగుదాం రేపు ఇద్దరం కలిసి వైజాగ్ వచ్చేద్దాం, అయినా ట్రైను కన్నా బస్సు ఇంకా బాగుంటుంది అన్నాడు.ఈసారి వెళ్ళకపోతే మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అనుకొని ఇదిగో ఇలా బస్సులో బయలుదేరాను.

కండక్టరు టికెట్లు ఇచ్చిన పావుగంటకు టీ తాగి,దమ్ము కొట్టి బస్సు తీసాడు డ్రైవర్.చాలా చిరాకు వచ్చింది కాని ఇంకా చాలా దూరం వెళ్ళాలి చిరాకుగా ప్రయాణం చేస్తే ఇంకా దూరంలా అనిపిస్తుంది అనుకొని మారిపోయిన మా ఊరిని చూస్తూ కూర్చున్నా.ప్రపంచంలో ఉన్న టైము అంతా తన దగ్గరే ఉన్నట్టు వెళ్తున్నాడు డ్రైవర్.

ఎన్.ఏ.డి జంక్షను వచ్చాక ఇద్దరు ముగ్గురు ఎక్కారు.బస్సు బయలుదేరుతుండగా ఎవరో బస్సుని గట్టిగా కొడుతున్నట్టు అనిపించింది.డ్రైవరు స్లో చేసాడు.ఒక పెద్దాయన గాబరగాబరాగా ఎక్కాడు.

“ఎందుకు అంత గాబరా? అర గంటకో బస్సు ఉంది.కింద పడుంటే ఉన్న పళ్ళు అన్నీ రాలిపోయేవి” డ్రైవర్ గట్టిగా తిట్టాడు.ముందునున్న ఇద్దరు ఆడవాళ్ళు నవ్వారు.

అతను ఏమీ అనలేదు.వచ్చి, నాకు 2 సీటుల ముందు కూర్చున్నాడు.కండక్టరు వచ్చి టికట్ టికట్ అని అరిచాడు.

పెద్దాయన “ఆ?!!” అన్నాడు.

“టికట్ తాతా టికట్,ఏక్కడికి వెళ్ళాలి?”

“కరకవలస” అని 100 ఇచ్చాడు.

“చిల్లర లేదు తరువాత తీసుకో” అనేసి టికెట్టు ఇచ్చేసి,100 నోటు జేబులో పెట్టుకొని వెళ్ళిపొయాడు.

అప్పుడు చూసాను ఆ పెద్దాయన్ని దగ్గర నుంచి.బట్టలు మాసి పోయి ఉన్నాయి,మాసిన గడ్డంతో మరీ ఎక్కువ వయస్సు ఏమీ కాకపోవచ్చు అనిపించింది.మనిషిలో ఏదో కళ ఉంది.

మధ్యలో పెందుర్తి దగ్గర ఒక కాలేజీ గాంగ్ ఎక్కింది.

బస్సు మెల్లగా కదులుతోంది.దారి పొడువునా ఆ కాలేజీ గాంగ్ పాటలు,అల్లరితో గడిచిపోయింది.అందరూ ఎంజాయ్ చేసారు,ఆ పెద్దాయన తప్ప.ఒక గంటన్నర తరువాత ఎస్.కోట చేరాం.

“బస్సు ఒక పావుగంట ఆగుతుంది.తరువాత అంతా ఘాట్ రోడ్డే ఏమీ దొరకదు.టీలు,టిఫిన్లు ఇక్కడే” గట్టిగా అరిచేసి వెళ్ళిపొయాడు కండక్టర్.

నాకు బయట తినడం ఇష్టం ఉండదు.నేను బస్సులోనే కూర్చున్నా.అందరూ దిగిపోయారు ఆ పెద్దాయన,నేను తప్ప.ఇంతలో గుర్తుకు వచ్చింది మంచి నీళ్ళు తీసుకు రాలేదని.బస్సు దిగడానికి వెళ్తుంటే ఆ పెద్దాయన కూర్చున్న దగ్గర 500 నోటు కనిపించింది.అది తీసి ఎటో చూస్తున్న అతన్ని పిలిచి చేతిలో పెట్టను.అతను ఏమీ అనకుండా జేబులో పెట్టుకొని మళ్ళీ ఎటో చూడడం మొదలు పెట్టాడు.

బస్సు దిగాక అనిపించింది అనవసరంగా ఇచ్చాను అసలు థాంక్సు లేదు,ఏమీ లేదు అని.తరువాత అనుమానం వచ్చింది అసలు అది అతనిదేనా అని.ఇప్పుడు ఇంకేమీ చెయ్యలేము అనుకొని వాటర్ బాటిల్,ఈనాడూ కొనుక్కొని వచ్చి కూర్చున్నా.

పావు గంట అయినా డ్రైవరు బస్సు తీసే సూచనలు కనబడటం లేదు.పేపరు తీసి చదవడం మొదలు పెట్టా.ఇంతలో బస్సు హారను వినిపించింది.హమ్మయ్య చివరకి తీస్తున్నాడు అనిపించింది.

తీరా చూస్తే ఈ పెద్దాయన వెళ్ళి హారను కొడుతున్నాడు.

డ్రైవరు కోపంగా వచ్చి “అంత గాబరా గా ఉంటే ఏ ఆటో లోనో వెళ్ళొచ్చు కదా,మాకూ నీ బాధ తప్పేది” అని తిట్టాదు.ఈసారి ఇద్దరు ఆడవాళ్ళతో పాటు కాలేజి గాంగ్ కూడా కిసుక్కున నవ్వారు.అతను ఏమీ అనలేదు.అలాగే కూర్చున్నాడు.

“చెవుడేమోలేరా !! నువ్వు బండి తీయ్”, అరిచాడు కండక్టరు.

బస్సు మళ్ళీ బయలుదేరింది.కొంచెం దూరం రైలు పట్టాలతో తో పాటు వెళ్ళి, ఇంకొంత దూరం వెళ్ళాక ఇందాక కండక్టరు చెప్పిన ఘాట్ రోడ్డు ఎక్కింది.చెట్లు, అక్కడక్కడ చిన్న చిన్న జలపాతాలతో  చాలా బాగుంది.

అందరూ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నారు.ఈ పెద్దాయన మాత్రం జేబులోంచి పర్సు తీసి ఏదో చూసుకొని మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు.

ఒక చోట రోడ్డు కింద నుంచి రైలు సొరంగం ఉంది.కాలేజీ గాంగ్ డ్రైవర్ ని బ్రతిమాలుకొని అక్కడ దిగి ఫొటోలు దిగడం మొదలు పెట్టారు.డ్రైవరు కూడా దిగి వాళ్ళకి ఏదో చూపిస్తున్నాడు.ఇంతలో మళ్ళీ ఈ పెద్దాయన వెళ్ళి హారను కొట్టాడు.ఈ సారి డ్రైవరుకి కోపం నషాలానికి ఎక్కింది.

“నువ్వు బస్సు దిగవయ్యా ముందు.మమ్మల్ని పట్టుకొని తినేస్తున్నావ్” అని అరవడం మొదలు పెట్టాడు.పెద్దాయన మాత్రం ఏమీ అనకుండా వచ్చి సీటులో కూర్చున్నాడు.

“ఎందుకు వచ్చిన గొడవలే శివా పదపద”, కండక్టర్ అన్నాడు పెద్దాయన్ను కోపంగా చూస్తూ.

మధ్యలో బొర్రా గుహల దగ్గరా పావు గంట ఆపేశాడు.ఏమీ తోచక పక్కన పడేసిన పేపర్ తీసా.నిన్ననే దంతేవాడాలో నక్సలైట్లు జవాన్లని కాల్చేసారట.నాకు వెంటనే అనుమానం వచ్చింది కొంపదీసి ఈ పెద్దాయన ఏ నక్సలైటో,తీవ్రవాదో కాదు కదా అని.మనిషి కొంచం తేడా గానే ఉన్నాడు.మాటిమాటికీ పర్సు తీసి చూసుకుంటున్నాడు.సినిమాల్లో చూపించినట్టు ఏ సుసైడ్ బాంబరో కాదు కదా.

బొర్రా గుహలు దాటాక అక్కడక్కడ విసిరేసినట్టు పాకలు కనిపిస్తున్నాయి.

ఒక్కసారిగా పెద్దాయన లేచి “ఆపండి!!!”, అని అరిచాడు.

“ఇంక కరకవలస వరకూ ఆగేది లేదు.టికెట్టు అక్కడికే తీసుకున్నావు కద.ఎగతాళిగా ఉందా.ఇంక 15 కిలోమీటర్ల వరకూ ఆగడం కుదరదు”, కండక్టర్ అన్నాడు.

“ఆపండి!! ఆపండి!!”, ఈ సారి ఇందాకటి కన్నా గట్టిగా అరిచాడు.

అతను దిగిపోతే కాస్త కుదురుగా ఉండొచ్చు అని మనసులో అనుకొని, ”సరేలెండి ఆపేయండి.పాపం పెద్దాయన”,అన్నాను నేను.

కండక్టరు ఈలకి బస్సు ఆగింది.అందరూ తిట్టుకుంటున్నారు.

అప్పుడు కిటికీ బయటకు చూసా.ఒక చిన్న ఇల్లు.బయట కొంచం జనం.పెద్దాయన పరుగు పరుగున లోపలికి వెళ్తున్నాడు. లోపలి నుంచి ఒక్కసారిగా ఏడుపులు వినిపించాయి.

బయట నలుగురు కూర్చొని పాడె సిధ్ధం చేస్తున్నారు.

- పవన్

(గమనిక: మలయాళంలో వచ్చిన కేరళా కెఫే అన్న సినిమాలోని ఒక కధ ఆధారంగా)

ఎట్టకేలకు నేను కూడా ఒక బ్లాగు మొదలు పెట్టాను.అందరి బ్లాగులు చదివి అన్నీ కలిపి కలగూర గంపగా ఎక్కడ రాస్తానో అని ఇంకా భయంగానే ఉంది.ఏది అయితే అయ్యింది విజయమో,వీరస్వర్గమో ముందు ముందు తెలుస్తుంది.

ఇక ఈ టపాకి ‘ఆరంభ శూరత్వం’ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది.చిన్నప్పుడు మా అమ్మ చెప్తుండేది మన వాళ్ళకి ఆరంభ శూరత్వం ఎక్కువ,పని చాలా బాగ మొదలు పెడతారు కాని పూర్తి చెయ్యరు అని.

ఈ విషయంలో నేనే ఒక పెద్ద ఉదాహరణ.

చెన్నైలో సాధారణంగా రాత్రి పూట భోజనం దొరకదు,ఎక్కడో పెద్ద హోటల్లలో తప్పిస్తే.అంతా పరోటాలు,తిఫిన్లే.మన వైపేమో రాత్రి భోజనాలు ఎప్పుడూ విందు భోజనాలే ఆయె (అలా తినకూడదట,సైన్సు చెప్తోంది,కాని ఈ బుజ్జి కడుపుకి అంత సెన్సు ఎక్కడిది).ఏమైనా అంటే అందరూ కలిసి తినేది అప్పుడే కద,అలాంటప్పుడు ఎందుకు కడుపు మాడ్చుకోవడం అంటారు.మా ఇంట్లో చెప్తే పెద్దైయ్యాక అలాగే చేద్దువ్వు గాని ఇప్పుడు తిను అని చెప్పి చిన్నప్పటి నుంచి అలవాటు చెసేసారు.

ఇక ఈ టిఫిన్లతో మనకి కుదరదు,మన పాకశాస్త్ర ప్రావీణ్యం ప్రదర్శించాలి అని ఒక ఘాట్టి నిర్ణయానికి వచ్చి ఒక రోజు ఆవేశంగా పాండి బజార్ శరవణ స్టోర్స్ కి వెళ్ళి వంట సామాను అంతా కొనేశా.మా ఇంటి దగ్గర ఉన్న రిలయన్స్ నుంచి కూరగాయలు కూడా కొన్నా.

మొదటి రోజు మా ఇంటి వంటలో ఐటం : ఆంధ్రా కర్రీ.

గాభరా పడకండి.ఆ మధ్య ఆ రెండు ఉద్యమాలూ మాంచి ఊపు మీద ఉన్న టైంలో చేసిన ప్రయోగం కనుక ఆ పేరు పెట్టాను.(ఆ కూర ఆ పేరు నిలుపుకుంది లెండి).

కావలసిన పదార్థాలు:

తెలంగాణా టమాట – ఎంత వేశానో గుర్తులేదు.

రాయలసీమ ఉల్లి గడ్డ – ఇది మాత్రం కష్టపడి ఏడుస్తూ ఒకటి కోసా

కోస్తా దొండకాయ – చేతికి వచ్చినన్ని కోసి వేసా

ఇతరత్రా సామాను

అన్నీ కలిపి ఒక బాణిలో వేసి చేతికి దొరికిన ఇతరత్రా సామాను వేసాను.

ఒక పావు గంట తరువాత,బాగ కలిపాక,కర్రీ తయారు అయ్యింది.

చూడడానికి బాగానే ఉంది.ఇంక హోటల్ తిండి ఎవడికి కావాలి,మనమే మూడు పూటలా కుమ్మేద్దాం అన్నుకున్నా.

ఇంకా ఈస్ట్ మన్ కలర్ లో ఫ్యూచర్లో ఒక తాజ్ రేంజ్ హోటల్ కూడా ప్లాన్ చేసా.

సరే వంట కార్యక్రమం అయ్యింది ఇంక విందు భోజనమే అని కూర్చున్నా.అన్నంతో కలుపుకు తింటే,అంతా బాగానే ఉంది కాని ఏదో తేడా.సమయానికి ఏదో తెలుగు వంటల సైటు తేరిచి ఉంది.అందులో అన్ని పదార్థాలు సరి చూసుకున్నా.నా చూపు ఒక్క చోట ఆగిపొయింది.

హతవిధీ!!! కూర వండితిని ఉప్పు మరచితిని !!!

బాగా ఆలొచిస్తే ఉప్పు కొనడమే మరచితిని.ఇంక అంత రాత్రి ఉప్పు ఎక్కడినుంచి తెస్తాంలే అని నా ప్రత్యేకతైన మ్యాగీ నూడల్స్ వండుకు తిన్నా.

(కూరకి ఆంధ్రా పేరు పెట్టినందుకు ఆరంభ శూరత్వం చూపించింది)

రెండో రోజు: ఉప్పు తీసుకు వచ్చా.కానీ కూర ఉడుకుతున్న టైములో ప్రతిపక్షాల కుట్ర వల్లన కూర మాడుతున్న వాసన వచ్చినా చూసుకోక ఈ రోజు మ్యాగీ సూపు చేసుకు తిన్నా.

మూడో రోజు: మా ఇల్లు ఉంది,ఇంట్లో వంట లేదు

నాలుగో రోజు: మా ఇంటి వంట కాస్తా ‘ఇంట్లో బంగాళా దుంపలూ,టమాటాలు పెంచడం ఎలా’ గా మారింది(అనగా కూరగాయలు అన్నీ కుళ్ళిపొయాయి)

ఆ తరువాత ఇంకా కొత్త వంటలు ఏవీ కల లోకి కూడా రానివ్వలేదు.(అవి వస్తే మళ్ళీ తాజ్ హోటల్ గుర్తుకు వచ్చి పుండు మీద కారం జల్లినట్టు ఉంటుంది అని)

మొత్తానికి అలా నిర్విఘ్నంగా నా వంట కార్యక్రమం ప్రారంభించి అంతే నిర్విఘ్నంగా నిలిపివేసాను.

ఇప్పుడీ బ్లాగు మొదలు పెట్టాను. ఇది కూడా ఆరంభ శూరత్వం కాకుండా నన్ను దీవించ ప్రార్థన.

కూడలిలో నా బ్లాగు జత పరిచినందుకు కూడలి టీం కి నా ధన్యవాదములు.

అందరికీ నమస్కారం.

ఈ తెలుగు బ్లాగ్ ప్రపంచం తో నా అనుబంధం, నాకు చాలా ఇష్టమైన ఈనాడు పత్రికతో వచ్చే ఆదివారం అనుబంధంలో వచ్చిన ఒక చిన్న వ్యాసం తో మొదలయ్యింది. అది అబ్రకదబ్ర గారి బ్లాగ్ గురించి.

ఎప్పుడో 2 సంవత్సరాల క్రిందట ఎక్కడ చూసినా బ్లాగుల గురించే.మనమూ ఒక రాయి వేద్దాం అని ఒక బ్లాగ్ రాశా “బిజినెస్స్ కాల్ద్ లైఫ్” అని. ఒక రెండు పోస్టుల తరువాత ఏమి రాయలో తెలియక, రాయడానికి సమయం లేక, ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే సరి అయిన దిశానిర్దేశం లేక కలం ముందుకి కదల లేదు.

ఆ తరువాత కాలక్రమం లో చాలమంది నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బ్లాగు లొకాన్ని ఏలుతున్నారు అని తెలిసింది. ఒక్కసారిగా నాకూ ఒక విధమైన రచనావేశం కలిగింది. కాని మళ్ళీ అదే సమస్య ఏమి రయాలి.

మొదటగా అబ్రకదబ్ర గారి బ్లాగ్ ఒకటి చదివాను.నిజం చెప్పొద్దూ,నాకు చాలా నచ్చింది.మెల్లమెల్లాగా ఆ బ్లాగ్ లో ఉన్న అన్ని వ్యాసాలు చదివా. ఆ తరువాత మెల్లగా కూడలి, అక్కడి నుంచి కూడలిలో మెల్లగా ఒక్కోక్క బ్లాగ్ చదవడం మొదలు పెట్టా.ఎందరివో బ్లాగులు చదివా.

చాలా మందివి పేర్లు గుర్తులేవు.ఏమీ అనుకోవద్దు.ఆ బ్లాగులలో ఉన్న,నాకు నచ్చిన విషయాలు చెప్తాను,దాని బట్టి అర్ధం చెసుకోగలరని మనవి.
నాకు బాగా గుర్తున్న బ్లాగులలో హరే-ఫలా పేరుతో ఫనిబాబు గారు రాసే బ్లాగు.జీవితాన్ని కాచి వడబోసి ఒక గ్లాసులో వేసి తాగటానికి ఇచ్చినట్టు ఉంటాయి ఆయన పోస్టులు.
తరువాత నెమలికన్ను బ్లాగ్,రెండు రెళ్ళు ఆరు…. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డు బ్లాగులు చదివా.ఒక ప్రభుత్వ ఉద్యోగిని బ్లాగు,ఒక కొత్తగా పెళ్ళైన అమ్మాయి బ్లాగు..ఇలా పేరు గుర్తులేని బ్లాగులు కూడా బొల్డు.
ఇక తెలుగులో బ్లాగడానికి కారణం తెలుగంటే నాకు చాలా ఇష్టం,ఎందుకో తెలియదు.నేను తెలుగు నేర్చుకుంది 8వ క్లాసులో.తెలుగు చదివింది 10వ క్లాసు వరకు.ఆ తరువాత మార్కుల వేటలో తెలుగుని ఎక్కడో కోల్పోయాను.ఆ తరువాత ఎంత చదివినా,మార్కుల కోసం తెలుగు చదవలేదు.బహుశా అందుకే తెలుగంటే ఇష్టమేమో.
తెలుగు చదివాను అంటే ఏ గ్రంధాలో కాదు,చదివింది వార పత్రికలు,దిన పత్రికలు.ఆ తరువాత ఈ మధ్య చదువుతోంది కూడలిలో బ్లాగులు.
మొత్తానికి కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్టు,నేను బ్లాగడానికి వెయ్యిన్నొక్క కారణాలు.
నా బ్లాగు మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ,ఎక్కడైన అక్షర దోషాలుంటే మన్నించమని కోరుతూ
మీ పవన్.
Follow

Get every new post delivered to your Inbox.